బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (09:52 IST)

మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య వార్... సరికొత్త వివాదంతో తాజా చిచ్చు.. ఏమిటది ?

ఆంధ్రప్రదేశ్ మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి నెలకొంది. మొన్నటి దాకా కోల్డ్ వార్‌గా ఉన్న స్థితి కాస్త బహిరంగ యుద్ధంగా మారుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టుకు భూసేకరణ వారిమధ్యన తాజా చిచ్చునకు కారణమవుతోంది. వీరి మధ్య పంచాయితీలు తీర్చలేక ముఖ్యమంత్రి సీరియస్ అవుతున్నట్లు సమాచారం. తనను ఆర్థికంగా బలహీనపరిచేందుకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పావులు కదుపుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశాడట.
 
భోగాపురం ఎయిర్ పోర్టు కోసం అధికారులు భూ సేకరణ చేస్తున్నారు. అయితే అక్కడ మంత్రి అయ్యన్న పాత్రుడికి సంబంధించిన భూములు ఉన్నాయి. అయితే తన భూములను భోగాపురం గ్రీన్ ఫీల్డ్ పరిధిలోకి తీసుకురావాలని మంత్రి గంటా అధికారులను పురిగొల్పుతున్నాడని అయ్యన్నపాత్రుడు సిఎంకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన చంద్రబాబును కోరారు. 
 
స్వామిని దర్శించుకుని బయటకు వస్తున్న మంత్రి
పాత్రుడు, గంటా శ్రీనివాసరావులు విశాఖపట్నం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటి నుంచే అయ్యన్న వీరి మధ్య తొలినుంచీ విభేదాలున్నాయి. ఇరువురి మధ్యా పలుమార్లు వివాదాలు పెచ్చుమీరడంతో సీఎం ఇద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసినా అది పొసగ లేదు. భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ విషయంలో మంత్రులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలు మంత్రివర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అదునుగా భావించిన గంటా శ్రీనివాస రావు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. అందునా తానే మానవవనరుల శాఖకు మంత్రి కావడంతో ఈ పనులను నేరుగానే చక్కబెడుతున్నారు. ఇందులోభాగంగానే అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందిన సన్ రే విలేజ్ రిసార్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం పరిధిలోకి తెచ్చేందుకు గంటా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయ్యన్నపాత్రుడు కుటుంబసభ్యులు భాగస్వాములుగా ఉన్న ఈ రిసార్ట్ ప్రతిపాదిత భోగాపురం ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మరో మంత్రి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారు. 
 
అయ్యన్నపాత్రుడు వాటా కలిగిన సన్ రే విలేజ్ రిసార్ట్‌ను కూడా భూ సేకరణ పరిధిలోకి తీసుకురావాల్సిందిగా గంటా ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆ రిసార్ట్‌ను కూడా భూ సేకరణ పరిధిలోకి తీసుకొస్తూ చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి గంటా ఈ ఆదేశాలు ఇచ్చినప్పుడు మంత్రి అయ్యన్న విదేశీ పర్యటనలో ఉన్నారు. 
 
వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న అయ్యన్నపాత్రుడు మంగళవారం, బుధవారాల్లో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుతో అపాయింట్‌మెంట్ తీసుకుని ఈ అంశమై ఫిర్యాదు చేశారు. తన కుటుంబసభ్యుల భాగస్వామ్యం ఉన్న రిసార్ట్ ను వెంటనే భూ సేకరణ పరిధి నుంచి తొలగించాల్సిందిగా ఆయ్యన్నపాత్రుడు సీఎంకు విజ్ఞప్తి చేయటంతో... అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇది మంత్రుల నడుమ మరో తాజా వివాదానికి కారణమవుతోంది.