గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2015 (14:17 IST)

ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు : రోజా

విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని వైకాపా ఎమ్మెల్యే సినీ నటి రోజా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆదివారానికి ఐదో రోజుకు చేరిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆమె వేదిక వద్ద ప్రసంగించారు.  
 
ఏపీని ముక్కలు చేసే సమయంలో రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తిరుపతి బహిరంగ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని చెప్పారు. ఇపుడు వెనక్కి తగ్గడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మోడీ ఇచ్చిన హామీకి పవన్ కల్యాణే సాక్షి అని అన్నారు. 
 
ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ఇప్పటికైనా సంఘీభావం తెలిపి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పవన్ కల్యాణ్కు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని రోజా ఆరోపించారు. కాంగ్రెస్తో కలసి తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని మీరేనంటూ రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్ జగన్ ఫైటర్ అయితే చంద్రబాబు ఛీటర్ అని రోజా అన్నారు.