బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 జులై 2016 (08:56 IST)

హోదాపై అమీతుమీ నేడే... కేవీపీ బిల్లుపై చర్చకు 2 గంటల సమయం కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేటాయించాలని కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో గురువారం చర్చ జరుగనుంది. ఈ బిల్లుపై చర్చించేందుకు 2 గంటల సమయం కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేటాయించాలని కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో గురువారం చర్చ జరుగనుంది. ఈ బిల్లుపై చర్చించేందుకు 2 గంటల సమయం కేటాయించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ఈ ప్రైవేట్ బిల్లుపై చర్చ లేకుండా, ఓటింగ్ జరగకుండా అడ్డుకోవాలని బీజేపీ తీవ్రంగా యత్నించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టి.. సభను స్తంభింపజేసింది. ఇంతలో రంగ ప్రవేశం చేసిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... అది ద్రవ్య బిల్లు అని, రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదని ప్రకటించారు. దీంతో ప్రత్యేక హోదా అంశంపై నీళ్లు గుమ్మరించారు. 
 
కానీ బుధవారం శరవేగంగా రాజకీయ పరిణామాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై గురువారం రాజ్యసభలో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ నేతృత్వంలో బుధవారం జరిగిన ఆయా పార్టీల సభాపక్ష నేతల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. చర్చకు అంగీకరించిన సభానాయకుడు జైట్లీ.. చర్చ తర్వాత ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును ఉపసంహరించుకోవాలని షరతు విధించారు. ప్రభుత్వం ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా ఉంటే బిల్లును వాపస్‌ తీసుకోవాలని కేవీపీని కోరతామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు.