ఏపీ రాజధాని గురించి వాకబు చేసిన సచిన్!
భారతరత్న, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఏపీ రాజధానిపై వాకబు చేశారు. విజయవాడ నగరం గురించి మాస్టర్ ఆరా తీశారు. నగరంలో శుక్రవారం పీవీపీ మాల్ ప్రారంభోత్సవ కార్యాక్రమానికి అతడు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా తాను 20 ఏళ్ల కిందట క్రికెట్ ఆడటానికి వచ్చానని, అప్పటి బెజవాడకు, ఇప్పటికి ఉన్న తేడాను గమనిస్తూ సచిన్ ...పీవీపీని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు, కొత్త రాజధానిపై సచిన్ ఆరా చేసినట్లు సమాచారం.
కాగా కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలో సచిన్ పెద్ద ఎత్తున భూములు కొన్నట్లు ఓ రూమర్ హల్చల్ చేసింది. రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యే ఉంటుందని ప్రచారం జోరందుకోవటంతో అతడు ఇక్కడ భూములు కొన్నాడని ప్రచారం జరిగింది. అయితే సచిన్ స్నేహితులు మాత్రం ఈ వార్తను కొట్టిపారేశారు.
ఆంధ్రప్రదేశ్లో సచిన్ ఒక్క సెంటు భూమి కూడా కొనలేదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వర్గాలు భూముల ధరను పెంచడానికే ఈ ప్రచారం చేసినట్లు వారు తెలిపారు. అయితే దీనిపై సచిన్ మాత్రం పెదవి విప్పలేదు. కాగా గతంలో నెల్లూరు జిల్లాలో సచిన్ భూములు కొన్న సంగతి తెలిసిందే.