శేషాచలం ఎన్కౌంటర్ : హైకోర్టు ఆధీనంలోకి సిట్!
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తన పరిధిలోకి తీసుకుంది. ఈ మేరకు కోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా, ఈ కాల్పుల ఘటనపై రెండు నెలల్లో (60 రోజులు)గా దర్యాప్తు పూర్తి చేయాలని సిట్ను ఆదేశించింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆధ్వర్యంలో శేషాచలం ఎన్కౌంటర్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరుగనుంది. కాగా సిట్లో ఉన్న సభ్యులపై అభ్యంతరాలుంటే ప్రమాణ పత్రం దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దేశ వ్యాప్తంగా ఈ కాల్పుల ఘటన సంచలనమైన విషయం తెల్సిందే. దీంతో హైకోర్టుతో పాటు.. జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని విచారణ జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సిట్ను హైకోర్టు తన పరిధిలోకి తీసుకోవడం గమనార్హం.