శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:29 IST)

శేషాచలం అడవులకు ఎవరు నిప్పుపెడుతున్నారు... మళ్లీ మంటలు...

ఎండాకాలం వచ్చిందంటే చాలు శేషాచలం అడవులు తగలబడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈదురు గాలులు వస్తే చాలు రాళ్ళు రాళ్ళు రాసుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఎండుటాకులు ఎక్కువగా ఉండటంతో ఇక మంటలు దట్టంగా అలుముకుంటాయి. గత మూడురోజులుగా శేషాచలం అడవుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
 
మధ్యాహ్నం అయితే సరే శేషాచలం అడవుల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. మూడు రోజులకు ముందు కపిలతీర్థం సమీపంలోని మాల్వాడి గుండంపై మంటలు వ్యాపించి, నాలుగు గంటలకుపైగా అడవులు కాలుతూనే ఉన్నాయి. అయితే అటువైపు వెళ్ళేందుకు అగ్నిమాపక సిబ్బందికి దారి లేకపోవడంతో చేతులెత్తేశారు. వాతావరణం చల్లబడే కొద్దీ ఆ మంటలు కూడా తగ్గుముఖం పడ్డాయి. మంటలు ఆరిపోయాయిలే అనుకున్న సమయానికి శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరిగి మంటలు చెలరేగాయి. 
 
తిరుమలలోని బాటగంగమ్మ ఆలయ సమీపంలో మంటలు దట్టంగా వ్యాపించాయి. దట్టంగా పొగ కూడా వస్తుండటంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఫైరింజన్లు సంఘటనా స్థలంలో మంటలు ఆర్పుతున్నాయి. అయినా సరే మంటలు అదుపులోకి రావడం లేదు. 
 
బాటగంగమ్మ ఆలయ సమీపంలో జన సంచారం ఎప్పుడూ ఉంటుంది. మంటలు దట్టంగా వ్యాపించడంపై ఫైర్‌ సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలు అగ్గిపుల్లలను గీసి వెళ్ళిపోయారేమోనని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.