శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:48 IST)

చంద్రబాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంది : శివాజీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంది సినీ నటుడు, బీజేపీ యువనేత శివాజీ ఆరోపించారు. ప్రత్యేక హోదాపై కేంద్రం వెనుకడుగు వేయడంపై శివాజీ మండిపడ్డారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కుపోయారన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభ సాక్షిగా లిఖితపూర్వక సమాధానం వచ్చిన తర్వాత కూడా వస్తుందని ప్రజలను మభ్యపెట్టడం సరికాదని హితవు పలికారు. బీజేపీ చంద్రబాబును ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టడంతో కేంద్రాన్ని ఎదిరిస్తే, వచ్చే నాలుగు పైసలు కూడా రావేమోనని బాబు భయపడుతున్నారని శివాజీ వెల్లడించాడు.
 
ఇప్పటికే రాష్ట్రం కష్టాల్లో ఉందని, కేంద్రాన్ని ఎదిరిస్తూ మరిన్ని కష్టాల్లో కూరుకుపోవడం ఇష్టంలేని ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తున్నారని శివాజీ అభిప్రాయపడ్డారు. పగలనక రాత్రనక, ఇల్లు వదిలి చంద్రబాబు కష్టపడుతుంటే, ఆయనకి మరిన్ని నిధులు, హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రానికి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వస్తున్నాయని అంతా చెబుతున్నారని, వాటి వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే ఉపయోగం ఎవరైనా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదావస్తే, రాయితీలు వస్తాయని, తద్వారా పరిశ్రమలు వచ్చి, యువతకు ఉపాధి దొరుకుతుందని శివాజీ చెప్పుకొచ్చారు.