మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (10:39 IST)

పాము కరిచిందని ఆస్పత్రికి తీసుకెళ్తే.. బతికుండగానే పోస్టుమార్టం చేశారు..

పాము కరిచింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలికను ఆస్పత్రికి తరలిస్తే.. బతికుండగానే శవపరీక్ష చేసిన ఘోరం వరంగల్‌లో చోటుచేసుకుంది. బతికుండగానే చనిపోయిందని.. శవపరీక్షకు పంపిన ప్రైవేటి ఆస్పత్రి వైద్యు

పాము కరిచింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలికను ఆస్పత్రికి తరలిస్తే.. బతికుండగానే శవపరీక్ష చేసిన ఘోరం వరంగల్‌లో చోటుచేసుకుంది. బతికుండగానే చనిపోయిందని.. శవపరీక్షకు పంపిన ప్రైవేటి ఆస్పత్రి వైద్యులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా వైద్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మృతిచెందిన బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని హవల్దార్ పల్లికి చెందిన గూళ్ల సదానందం కుమార్తె రిషిత (13)ను ఈ నెల 19వ తేదీ రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఓ పాము కరిచింది. తల్లిదండ్రులు వెంటనే ముల్కనూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రిషితను తరలించారు. 
 
ఆపై మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో, హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు బాలిక మరణించిందని చెప్పడంతో విలవిల్లాడిపోయారు. 
 
శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించడంతో, పోస్టుమార్టం వేళ, పాప ఇంకా బతికే ఉందని గుర్తించిన వైద్యులు, అత్యవసర చికిత్స చేసినప్పటికీ, ఫలించలేదు. అప్పటికే విషం శరీరమంతా వ్యాపించగా, మంగళవారం సాయంత్రం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మల్కనూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
 
మరోవైపు కృష్ణా జిల్లాలో పాము కాటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. భారీ వర్షాల కారణంగా పాములు ఊళ్లలోకి, పొలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. వర్షాకాలంలో పొలం పనులు ఊపందుకోవడంతో రైతులు పగలనక, రాత్రనక పనులు చేస్తుంటారు. ఇలా పొలం పనులకు వెళ్లే రైతులు భారీగా పాముకాట్లకు గురవుతూ వైద్యం అందక మరణిస్తున్నారు.
 
గత మూడు రోజుల నుండి ఈ పాము కాట్ల బాధితుల సంఖ్య పెరుగుతోంది. అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటివరకు పాము కాటు బాధితుల సంఖ్య 38కి చేరినట్లు తెలుస్తోంది. ఇలా సోమవారం ఒక్కరోజే 27 పాము కాటు కేసులు నమోదవగా, మంగళవారంతో కలిపి మరో 11 కేసులు నమోదయ్యాయి.