అమ్మో...! పాముకాటు : బాలిక మృతి.. బాలుడి పరిస్థితి విషమం
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు పిల్లలను పాము కాటేసింది. ఈ పాము కాటునకు ఒకరు మరిణించగా మరొకరికి సీరియస్గా ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కాత్రికి గ్రామంలో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.
కాత్రికి గ్రామానికి చెందిన వెంకటేశులు, వెంకటేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెద్ద కుమార్తె కల్పన(11), బాలుడు ఈశ్వర్(3) పాముకాటుకు గురయ్యారు.
గమనించిన తల్లిదండ్రులు ఇద్దరినీ ఆదోని ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని కర్నూలు ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో చిన్నారులను కర్నూలు తరలిస్తుండగా మార్గ మధ్యంలో కల్పన మృతిచెందింది. ఈశ్వర్ పరిస్థితి విషమంగా ఉంది.