ప్రత్యేక ప్రయోజనాలు సాధిస్తా : చంద్రబాబు... ఏమిటా ప్రత్యేక ప్రయోజనాలు..?
దయచేసి మమ్మల్ని నిందించకండి... మా చిత్తశుద్ధిని శంకించవద్దు.. ప్రత్యేకహోదా విషయంలో చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. శాసనమండలిలో ప్రత్యేక హోదాపై ఆయన గురువారం తీర్మానం ప్రవేశపెట్టారు.
ప్రత్యేక హోదా రావడం ఆలస్యమవుతోందని కొంతమంది ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. అందరం కలిసికట్టుగా ప్రత్యేక హోదా సాధిద్దామని అన్నారు. విభజన సమయంలోకాంగ్రెస్ పార్టీ అనుసరించిన అనైతిక విధానాల వల్ల చట్టంలో అనేక లొసుగులు ఏర్పడ్డాయని, వాటి ఫలితంగా ప్రత్యేక హోదాపై గందరగోళం నెలకొందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ఇతర ప్రయోజనాల కోసం గత 15 నెలల్లో తాను 17 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పారు.
ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాలకు వచ్చే కేంద్రపన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచడంతో ప్రత్యేకహోదా రాష్ట్రాలకు నిధుల రాబడి గణనీయంగా పడిపోయిందన్నారు. ఈ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా అవసరమన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రత్యేక హోదాతో సాధ్యపడవని, వాటిని ప్రత్యేకంగా తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు ఇచ్చిన మాదిరి కొత్త పరిశ్రమలకు రాయితీలు, ఆదాయ పన్ను, వ్యాట్, సీఎస్టీలను మినహాయించాల్సిన అవసరం ఉందని, దీన్నే ఇప్పుడు కేంద్రాన్ని కోరుతున్నామని బాబు తెలిపారు.
1300 కోట్లతో పట్టిసీమను నిర్మిస్తున్నామని, దీంతో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఆ 8 లక్షల ఎకరాల్లో పంట ద్వారా రైతులు ఏడాదిలో రూ.1,000 కోట్ల వరకూ ఆదాయం సాధిస్తారని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ని విమర్శలు వచ్చినా భయపడబోనని, వెనకడుగు వేసేదే లేదని ఆయన స్పష్టం చేశారు. పట్టిసీమపై ప్రతిపక్షం చేస్తున్న వ్యతిరేక ప్రచారమే తమకు లాభిస్తోందని, పుష్కరాల సమయంలో రోజుకు లక్ష మంది రాయలసీమ వాసులు పట్టిసీమను సందర్శించారని చెప్పారు. దీంతో పట్టిసీమ టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చెందుతోందని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.