శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (13:10 IST)

శ్రీరామ నవమి వేడుకలు : ఏపీలో ఒంటిమిట్ట.. తెలంగాణాలో భద్రాచలం

దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట, తెలంగాణలోని భద్రాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీరామకల్యాణాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు దేవాలయాలకు చేరుకుంటున్నారు.
 
కడప జిల్లాలోని ఒంటిమిట్ట దేవాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను ఆరంభించారు. అంకురార్పణ కార్యక్రమానికి ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ హాజరుకాగా, భద్రాచలంలో సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం ప్రారంభమైంది. సూర్యచంద్ర వంశాల ఘనత చాటుతూ ఉత్తర ద్వార ప్రాంగణంలో మహోత్సవం నిర్వహిస్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో ప్రభుత్వం అధికారిక వేడుకలు నిర్వహించనుండగా, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనుంది. ఛైత్రశుధ్ద నవమి అభిజిత్ లగ్నమందు శ్రీరామకల్యాణం నిర్వహించనున్నారు. ఒంటిమిట్టలో వేడుకలకు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరయ్యారు. భద్రాచలంలో వేడుకల్లో టీఎస్ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 
 
ఉత్తరాంధ్రలోని రామతీర్థంలో కూడా ఏపీ ప్రభుత్వం అధికారికంగా వేడుక నిర్వహిస్తోంది. ఒంటిమిట్టలో శ్రీరాములోరికి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, రామతీర్థంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలను సమర్పించారు. భద్రాచలంలో కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, ఏప్రిల్ 2న జరిగే కల్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.