శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (09:50 IST)

చిన్నారి వైష్ణవి మృతి : బస్సు ప్రమాద మృతుల సంఖ్య 18!

మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే లెవన్ క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొని తీవ్రంగా గాయపడిన చిన్నారుల్లో వైష్ణవి (11) అనే విద్యార్థిని యశోదా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. దాంతో ఇప్పటిదాకా మరణించిన విద్యార్థుల సంఖ్య 18కి చేరుకుంది. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలిలోనే 14 మంది చిన్నారులు, బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందిన సంగతి విదితమే.
 
తీవ్రంగా గాయపడిన 20 మంది విద్యార్థులను అదే రోజు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందజేస్తున్నారు. వారిలో ప్రశాంత్, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేషన్ పైనే ఉంచి వైద్యసేవలను అందజేస్తూ వచ్చారు. అయితే, తరుణ్ అనే విద్యార్థి గతరాత్రి మృతి చెందగా, మంగళవారం తెల్లవారు జామున వైష్ణవి కన్నుమూసింది. దీంతో యశోద ఆస్పత్రి ఆవరణలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ పిల్లల్లో ప్రశాంత్ (6), వరుణ్‌గౌడ్ (7)) పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.