శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (08:55 IST)

సునంద పుష్కర్ హత్య : ఐపీఎల్ డీలింగ్‌లోనూ అమర్ సింగ్ జోక్యం..!

కేంద్ర మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసు విచారణలో భాగంగా ఎస్పీ మాజీ నేత అమర్ సింగ్ వద్ద ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం నాలుగు గంటల పాటు విచారణ జరిపింది. ఇందులో ఐపీఎల్ డీలింగ్‌ వ్యవహారంలో కూడా అమర్ సింగ్ జోక్యం ఉన్నట్టు తెలిసింది.
 
ఈ విచారణలో భాగంగా అమర్ సింగ్‌ను ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి మరీ ఆరా తీశారు. ఐపీఎల్‌ కొచ్చిన్ జట్టు ఏర్పాటు... రద్దుకు సంబంధించిన కోణంలో సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. సునంద కుమారుడు శివమీనన్‌ను కూడా విచారించినట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్‌ నేత, సునంద భర్త శశిథరూర్‌ను మరోసారి ప్రశ్నించనున్నట్లు సమాచారం.
 
కాగా, అమర్ సింగ్ కుటుంబానికి సునంద పుష్కర్, శశిథరూర్‌లు కుటుంబ స్నేహితులు కావడం గమనార్హం. పైగా ఐపీఎల్ డీలింగ్‌ వ్యవహారంలో కూడా అమర్ సింగ్ జోక్యం చేసుకున్నట్టు సమాచారం. ఐపీఎల్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన తర్వాతే సునంద పుష్కర్, శశిథరూర్‌ల మధ్య వివాదాలు తలెత్తినట్టు అమర్ సింగ్ చెప్పుకొచ్చారు.
 
ఇదిలావుండగా, ఈ కేసు విచారణకు హాజరుకావాలని సిట్ పోలీసులు అమర్ సింగ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. అలాగే, ఈ కేసులో శశిథరూర్, సునంద కుమారుడిని విచారిస్తామని సిట్ తెలిపింది. మరోవైపు, భార్య సునంద కేసులో తనను విచారించిన నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లకు థరూర్ స్పందించారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.