మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (07:25 IST)

టీసీఎల్ సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తాం: మంత్రి మేకపాటి

టీసీఎల్ కంపెనీ ప్రాజెక్టు పనులు తక్షణమే మొదలు పెట్టేందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్, మొదటి అంతస్తులో ఉన్న మంత్రి కార్యాలయంలో మేకపాటి గౌతమ్ రెడ్డితో టీసీఎల్ ప్రతినిధులు సమావేశమయ్యారు.

టీసీఎల్ ఎదుర్కొంటున్న కరెంట్, నీరు, రవాణా వంటి సమస్యలను కంపెనీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. విద్యుత్, నీరు, రవాణా సమస్యలు తొలగిపోతే కొత్త  ఏడాది నుంచే పనులు ప్రారంభించేందుకు తాము సిద్ధమని టీసీఎల్ ప్రతినిధుల బృందం మంత్రికి తెలిపారు.

రవాణాకు సంబంధించిన సమస్యలపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సత్వరమే చర్చిస్తానన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. టీసీఎల్ పరిశ్రమకు కావల్సిన నీటి సరఫరా విషయంలో  అందుబాటులో ఉన్న మార్గాలపైనా మంత్రి సమాలోచన జరిపారు. 

వచ్చే సోమవారం పరిశ్రమల శాఖతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ఉన్నట్లు మంత్రి ప్రతినిధులకు వెల్లడించారు. ఆ భేటీలో టీసీఎల్ ఇబ్బందులను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో టీవీ ప్యానల్‌ యూనిట్‌ ఏర్పాటు చేసిన చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ టీసీఎల్‌.. దశల వారీగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి కల్పన వంటి అంశాలపైనా మంత్రి చర్చించారు.

టీసీఎల్ పెండింగ్ పనులు పూర్తయితే 5వేల మందికి పైగా ఉపాధి దొరుకుతుందని ప్రతినిధులు మంత్రికి వివరించారు. టీసీఎల్‌ సమస్యలను వీలయినంత త్వరగా పరిష్కరించి పనులు మొదలయ్యేలా చూస్తామని మంత్రి ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీసీఎల్ ప్రతినిధులు, డైరెక్టర్ (ఐ.టీ ప్రమోషన్స్) ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.