శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (15:14 IST)

ట్రాన్స్‌పోర్టు బిజినెస్ మానేస్తున్నా... వెళ్లేవాళ్లు రాళ్లు వేయడం సహజమే : జేసీ దివాకర్

పార్టీ నుంచి బయటకు వెళ్లేవారు పార్టీ అధినేతపై నాలుగు రాళ్లు వేయడం సహజమే కదా అని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. గతంలో ఎంతో నమ్మకస్తుడుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సైతం చంద్రబాబును విమర్శించారని గుర్తుచేశారు. అలాగే ఇపుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా విమర్శలు చేశారన్నారు. 
 
తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోతోందని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష నేత పాత్ర కూడా సరిగా పోషించలేకపోతున్నారంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. 'పార్టీ మారే వారు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా? అందుకే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు' అని అన్నారు. కొన్ని నెలల క్రితం చంద్రబాబుపై సుజనా చౌదరి కూడా విమర్శలు చేశారని, వేధింపులకు భయపడి పార్టీలు మారకూడదన్నారు. 
 
ఇకపోతే, ప్రస్తుతం ఏపీలో ఉన్న జగన్ ప్రభుత్వంలో ప్రతీకార కోరిక ఎక్కువైందని ఆరోపించారు. ప్రత్యర్థులను హింసిస్తున్నారని, అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని వారు తెలుసుకోవాలని గుర్తుచేశారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల వల్లే అధికారులు కొందరిని వేధిస్తున్నారన్నారు. అదేసమయంలో ప్రస్తుతానికి తాము ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ను కొంతకాలం మానేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు.