శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (15:30 IST)

గంటాగారు.. పీహెచ్‌డీ ఎక్కడ చేస్తారో : టీడీపీ నేత

విశాఖపట్టణం టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ఎక్కువైంది. కొంతకాలంగా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు మధ్య పరోక్షంగా మాటల వార్ సాగుతున్న విషయం తెల్సిందే. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై తెలుగుదేశం పార్టీ నేత గవిరెడ్డి రామానాయుడు విరుచుకుపడ్డారు. పూటకో పార్టీ మార్చే గంటా, అయ్యన్న పాత్రుడిపై విమర్శలు చేస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు. 
 
మంత్రి గంటా శ్రీనివాసరావు, తన రాజకీయ లబ్ధి కోసం 'టెన్త్ చంద్రబాబు స్కూల్, ఇంటర్ చిరంజీవి కాలేజీ, డిగ్రీ కిరణ్ కుమార్ రెడ్డి కళాశాలలో చేరారని అన్నారు. పీజీ కోసం మళ్లీ చంద్రబాబు కాలేజీలో చేరిన ఆయన మరి హీహెచ్‌డీ ఎక్కడ పూర్తి చేస్తారో' అంటూ వ్యగ్యంగా మాట్లాడారు. మంత్రి అయ్యన్న పాత్రుడికి వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, అవకాశవాద, పార్టీ మార్చే రాజకీయాలు ఆయనకు లేవని రామానాయుడు అన్నారు. 
 
కాగా, ఇటీవల గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ తనది చంద్రబాబు స్కూల్ అని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనికి కౌంటర్ అటాక్‌గా అయ్యన్నపాత్రుడు అనుచరుడిగా ముద్రపడిన రామానాయుడు సోమవారం గంటాపై మండిపడ్డారు.