శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (21:00 IST)

విజయసాయిరెడ్డి పై టీడీపీ నేతలు ఆగ్రహం

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, జవహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇద్దరు నేతలు ట్విట్టర్ వేదికగా వేర్వేరుగా ధ్వజమెత్తారు.

టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నట్విట్టర్లో "వీసారెడ్డి గారు..మోడీ, అమిత్ షాని చూసి ప్యాంటు తడుపుకుంటున్నది ఎవరో మోదీగారి తిరుపతి పర్యటనలో ప్రజలంతా చూసారు. మెడలు వంచుతామని ప్రగల్బాలు పలికి ఇప్పుడు నడుం వంచి కాళ్లు పట్టుకుంటున్న మీరు కూడా ధైర్యం గురించి మాట్లాడితే ఆ ధైర్యానికి కూడా దరిద్రం పట్టుకుంటుంది
 
దరిద్రానికి జగన్ గారు బ్రాండ్ అంబాసిడర్ అని మీ ప్రభుత్వ వెబ్ సైట్ లొనే ఉంది చూసుకోండి. ఇతర రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నా రాష్ట్రంలో వర్షం లేదు. వరదని రాజకీయం చెయ్యాలని వేలుపెట్టి రాయలసీమ రైతులకు చుక్క నీరు లేకుండా చేసావు. మీ చెత్త ఐడియాలతో అమెరికా టూర్ మొత్తం తుస్సుమంది. ఆయన అమెరికా నుండి వచ్చే లోపు ముందు నువ్వు వెళ్లి రైతుల్ని బుగ్గలు నిమిరే పని మొదలు పెట్టుకో" అని హేళన చేశారు. 
 
ఇక మాజీ మంత్రి జవహర్ "విసా రెడ్డిగారూ! అత్త కొట్టినందుకు కాదుగానీ, ఆడపడుచు నవ్వినందుకు ఏడ్చినట్టుంది మీ ఏడుపు. అమెరికాలో మీ అధినేత చేసిన ఘనకార్యానికి బీజేపీ వాళ్ళేదో అంటే.. తెదేపా పైన పడి ఏడుస్తారెందుకు?
 
కేసులు తిరగతోడతారనే భయం ఎవరికీ ఉందో, అందుకోసం కాళ్ళు పట్టుకుందెవరో అందరికీ తెలుసు. మీ అధినేత ఉన్నన్నాళ్లూ ఒక్క నీటి చుక్క లేక అల్లాడిన ఏపీలో, ఆయన జెరూసలేం వెళ్తాడనగానే గోదారికి, అమెరికా వెళ్తాడనగానే కృష్ణకు వరదలొచ్చాయి. దీనినేమంటారు విసా రెడ్డిగారు. ఇంత వరదొచ్చినా ఇంకా తాగడానికి నీళ్లు లేక ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మీ పాలన మహిమ చూసారా?" అని ఎద్దేవా చేశారు.