శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (10:31 IST)

తిరుపతి వేదికగా తెలుగుదేశం మహానాడు అట్టహాసంగా ప్రారంభం

తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడుకు సర్వం సిద్ధమైంది. నగరంలోని నెహ్రూ పురపాలక మైదానంలో ప్రధాన వేదిక సహా ఇతర ప్రాంగణాలను ఏర్పాటుచేశారు. తిరుపతి వేదికగా మూడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదిక సహా ప్రాంగణాలు, ప్రత్యేక గ్యాలరీలు సిద్ధమయ్యాయి. రెండు తెలుగురాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఆత్మీయ ఆతిథ్యం పలికేందుకు తిరుపతి వేదిక ముస్తాబైంది. 
 
పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి శుక్రవారం ఉదయానికి తిరుపతికి చేరుకుని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఇరువైపులా కూలర్లు ఏర్పాటుచేశారు. ఎక్కడా రాకపోకలకు ఆటంకం లేకుండా వేదిక నుంచి చివరివరకు బ్యారికేడ్లు నిర్మించారు. ప్రతినిధులకు నిత్యం 27 రకాల వంటకాలను వడ్డించేందుకు రంగం సిద్ధమైంది. 
 
ఈ నెల 27 నుంచి 29 వరకూ జరిగే మహానాడులో గత రెండేళ్ల కాలంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని... భవిష్యత్తుకు దిశానిర్దేశం కోసం పలు అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన అనంతరం ఇది రెండో మహానాడు. జాతీయ పార్టీగా ఆవిర్భవించి కూడా దాదాపుగా అంతే కాలమైంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల అంశాలపైనా దృష్టిపెట్టనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి మొత్తం 30 వేల మంది ప్రతినిధులు మహానాడుకు రానున్నారని అంచనా. ఇందులో ఏపీకి సంబంధించి 13అంశాలు, తెలంగాణకు సంబంధించి 8అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. ఉమ్మడిగా ఏడు తీర్మానాలుంటాయి.