శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (19:21 IST)

ఎమ్మెల్యే బొండా తనయుడు అరెస్ట్: 304 (ఎ), 337 సెక్షన్ల క్రింద కేసు.. బెయిల్

గుంటూరు జిల్లాలో కార్ రేసింగ్‌ నిర్వహించి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధిక్, అతని స్నేహితుడు జై శివరాంను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ 304 (ఎ), 337 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచగా, 14 రోజుల పాటు రిమాండ్‌కు విధించింది. అదేసమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సిద్ధిక్, జై శివరాం దాఖలు చేసుకున్న పిటీషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు.. రూ.5000 పూచీకత్తుతో వారిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. 
 
కాగా, రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జరిగిన కారు రేసింగ్‌లో ఓ వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం సిద్దిక్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. జయవాడ కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థులు రెండు కార్లలో ఆదివారం చిలకలూరిపేటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
అత్యంత వేగంగా రెండు కార్లు పక్కపక్కనే వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ కారు అదుపుతప్పి రెండో కారును ఢీ కొంది. దీంతో అవి పల్టీలు కొడుతూ వెళ్లి ఒకటి హైవే అంచున బోర్లాపడగా, రెండోది పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. కార్లు పల్టీలు కొట్టే సమయంలోనే అందులో ఉన్న నాగేంద్ర (22) జాతీయ రహదారిపై పడి మృతిచెందాడు.