బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (16:03 IST)

రాజ్యాంగాన్ని అవమానించి.. అధికార దుర్వినియోగానికి పాల్పడిన యుపీఏ : రామ్మోహన్ నాయుడు

తెలుగుదేశం పార్టీకి చెందిన యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు గురువారం పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా టీడీపీ తరపున సభను ఉద్దేశించి ప్రసంగించారు. గత యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాజ్యంగాన్ని అవమానించిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ ఆరోపించారు. 
 
పెద్దన్న పాత్రను పోషించాల్సిన కేంద్రం... ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రయానికి సంబంధం లేకుండా విభజన చేసిందని ఆరోపించారు. కేంద్రం పెద్దన పాత్ర పోషించలేదని, నియంత పాత్ర పోషించిందని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడానికి కారణం పార్లమెంట్‌లో న్యాయం జరగాలని భావించారన్నారు. విభజనలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు విలువ నివ్వలేదని అన్నారు. చేయని తప్పుకు ఆంధ్రప్రదేశ్‌కు శిక్ష విధించారని, ఆ బాధను తాము ఇపుడు అనుభవిస్తున్నామన్నారు. 
 
గత ఎన్డీయే ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేసిందని చెప్పుకొచ్చిన రామ్మోహన్ నాయుడు... అపుడు ప్రజాభీష్టం మేరకే రాష్ట్ర విభజన చేసిందని ఆయన చెప్పారు. ఇకపోతే... పార్లమెంట్ పని చేయాల్సిన పద్దతి ఇది కాదన్నారు. అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగం అమలు కావాలని ఆయన సూచించారు. పార్లమెంట్ ముందుకు ప్రజలకు ఉపయోగపడే అంశాలు మాత్రమే బిల్లు రూపంలో రావాలని ఆయన సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి అంశాలు చాలా తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వాటిల్లో అయినా కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి, సామరస్య ధోరణితో సమస్యలు పరిష్కరించారని కోరారు.