శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (15:30 IST)

పెద్ద కొడుకు చంద్రబాబు... చిన్న కొడుకు జగన్ : ఢిల్లీ వీధుల్లో తెలుగుతల్లి

నా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు. ఈయన 62 యేళ్ళ వయసులో కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఢిల్లీ వీధుల్లో ధర్మపోరాట దీక్ష చేస్తుంటే.. నా చిన్నకొడుకు జగన్ మోహన్ రెడ్డి ఏమయ్యారని హస్తిన వేదికగా తెలుగుతల్లి ప్రశ్నించారు. 'నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం' అని తెలుగుతల్లి వ్యాఖ్యానించారు. 
 
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేసిన మోసానికి నిరసనగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులో తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు యామిని శర్మ తెలుగు తల్లి వేషం ధరించి తన నిరసనను తెలిపారు. అచ్చం తెలుగు తల్లిని ప్రతిబింభించేలా ఆమె వేషధారణ ఉంది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీకి అన్ని విధాలుగా మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, ఆరు పదుల వయసులో కూడా చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ఆమె అభినందించారు. 
 
కాగా, సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఢిల్లీ చేరుకున్నారు. శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్ల ద్వారా దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు తరలివెళ్లారు. దీంతో ఏపీ భవన్ మొత్తం నిండి పోవడంతో కొందరు కేరళ హౌస్‌కు వెళ్లారు. సాధినేని యామిని శర్మ కూడా కేరళ హౌస్ నుంచి తెలుగుతల్లి గెటప్‌తో ఏపీ భవన్‌కు వచ్చారు.