శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 23 ఆగస్టు 2014 (17:55 IST)

వ్యూహం రివర్స్... జగన్‌పై అనూహ్యంగా టిడిపి ఎదురుదాడి

అసెంబ్లీ సమావేశాల్లో హత్యారాజకీయాలపై శాసనసభలో చర్చకు తెచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ లోపలా బయటా తెంపు లేకుండా జగన్‌పై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నాయకులు జగన్ వైఖరిపై తూర్పారబడుతున్నారు.
 
మరోవైపు తెలుగుదేశం సభ్యులపై తాను చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. అధికార పక్ష సభ్యులు బఫూన్లంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 
 
ఈ వ్యాఖ్యలపై శాసనసభలో మరోసారి దుమారం చెలరేగింది. సభలో జగన్ క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టిడిపి సభ్యులు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
సభ కార్యక్రమాలు స్తంభించడంతో శాసనసభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. సభలో ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతున్న సమయంలో జగన్ సభలోకి వచ్చారు. ఈ సమయంలో అధికార పక్ష నేతలను బఫూన్లన్న జగన్ సభలో క్షమాపణ చెప్పాలని టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. 
 
టిడిపి సభ్యులకు స్పీకర్ కోడెల సర్దిచెప్పేందుకు యత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. భాన్ కిరణ్, కృష్ణ తెలుసా అని తాను జగన్‌ను అడిగానని, అలా అడిగితే తమను బఫూన్లంటూ వ్యాఖ్యానిస్తారా అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 
 
టిడిపి సభ్యుల ఆందోళనకు ప్రతిగా వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులు నినాదాలు చేశారు. జగన్ క్షమాపణ చెప్తే సభకు గౌరవమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ముఖ్యమంత్రులు, స్పీకర్లూ గతంలో క్షమాపణలు చెప్పిన ఘటనలు ఉన్నాయని, జగన్ క్షమాపణ చెప్పడానికి సంశయించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.