గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (08:05 IST)

ఏపీలో ఇక ఆంగ్లంలోనే బోధన

వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ తర్వాత 9-10 తరగతులకు కూడా అమలు చేయాలన్నారు. ఇంగ్లీషు బోధనపై 70 వేల మంది టీచర్లకు డైట్లలో శిక్షణ ఇప్పించాలని సూచించారు.

బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖపై సీఎం సమీక్ష చేశారు. ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌, సర్వశిక్షా అభియాన్‌ ఎస్‌పీడీ వాడ్రేవుల చినవీరభద్రుడు, అధికారులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ నాడు-నేడు కార్యక్రమం కింద రాష్ట్రంలోని 44,512 పాఠశాలలను బాగుచేయాలనేది ప్రభుత్వ అభిమతమన్నారు.

మొదటి విడతలో 15,410 స్కూళ్లలో పూర్తి స్థాయిలో మౌలికసదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతి దశలోనూ పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలకు చెందిన స్కూళ్లు కూడా ఉండేలా చూసుకోవాలన్నారు. తొలివిడతలో టార్గెట్‌ పెరిగినా ఫర్వాలేదని, ఏ స్కూలు తీసుకున్నా 9 రకాల పనులు తప్పనిసరిగా పూర్తిచేయాలని సూచించారు.

నాణ్యతలో రాజీ పడరాదన్నారు. మార్చి 14 నాటికి తొలిదశ పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెప్పగా, విద్యా కమిటీలు సామాజిక తనిఖీలు చేయాలన్నారు. బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన కలిగించాలని అన్నారు. పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలని సూచించారు. టీచర్ల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రతి ఏడాది జనవరిలో చేపట్టాలని ఆదేశించారు.

ఏ శాఖ ఏ పరీక్షలు పెట్టాలన్నా జనవరి లో నిర్వహించాలన్నారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, రహదారి భద్రతపై పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని సూచించారు. పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం, షూ ఇవన్నీ కూడా వచ్చే ఏడాది పిల్లలు స్కూల్లో చేరిన రోజే ఇచ్చేలా చూడాలన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన గుడ్లు అందించేందుకు ఆలోచనలు చేయాలన్నారు. ప్రతి మండలానికి జూనియర్‌ కాలేజీ ఉండేలా భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధం చేయాలని, ప్రస్తుతం ఉన్న స్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్‌ టూ వరకూ పెంచాలని సూచించారు.