గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By

ప్రియుడి చదువుకు రూ.లక్షలు ఖర్చు.. ఆపై సహజీవనం.. జాబ్ రాగానే ప్రియుడు మోసం

పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని ఓ యువకుడు నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆ యువతి ప్రియుడు చదువు కోసం లక్షన్నర రూపాయలను ఖర్చు చేసింది. ఆ తర్వాత ఐదేళ్ళ పాటు ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఇంతలో చదువు పూర్తి చేసిన ప్రియుడికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అతను ప్రియురాలికి చెప్పాపెట్టకుండా పారిపోయాడు. తాను మోసపోయానని తెలిసుకున్న ఆ యువతి ప్రియుడు ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని దేవరకద్ర మండలం చిన్న చింతకుంటలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 2010లో హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చిన మోహన్ కుమార్ అనే యువకుడితో చిక్కడపల్లిలోని ఓ మహిళా కళాశాలలో చదువుకుంటున్న నర్మదకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆపై ప్రేమగా అవతరించగా, మోహన్ కుమార్ చదువు కోసం నర్మద రూ.1.50 లక్షలు ఖర్చుచేసింది. 
 
2014లో చదువు పూర్తయిన క్రమంలో నర్మద తల్లిదండ్రులకు ఫోన్ చేసిన మోహన్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని, మరో సంబంధం చూడవద్దని చెప్పాడు. ఆపై కాగ్నిజెంట్‌ కంపెనీలో మోహన్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. ఆపై దాదాపు ఐదు సంవత్సరాలుగా ఇద్దరూ సహజీవనం చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని నర్మద కోరగా, చెల్లి పెళ్లి తర్వాత చేసుకుందామని నమ్మించాడు. 
 
చెల్లి పెళ్లి తర్వాత, తన తల్లి ఒప్పుకోవడం లేదని, పెళ్లి చేసుకోలేనని చెబుతూ, నర్మదను దూరం పెట్టసాగాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై తనకు న్యాయం జరగడం ఆలస్యమవుతోందని ఆరోపిస్తూ, ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. తనకు పెళ్లంటూ జరిగితే మోహన్‌తోనే జరగాలంటూ భీష్మించుకుకూర్చుంది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.