గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (16:42 IST)

విజయవాడలో టెక్కీ ఆత్మహత్య... గదిలో ఉరికి వేలాడుతూ...

విజయవాడలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ టెక్కీ పేరు కొమ్మరి కృష్ణమూర్తి. విజయవాడలోని మాచవరంలో గల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ టెక్కీ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి వీరయ్య గుణదల కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో పనిచేస్తూ పదవీ విరమణ చేశాడు. కృష్ణమూర్తికి ఆరేళ్ల క్రితం హైదరాబాదుకు చెందిన గీతతో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల తేజస్విని అనే కూతురు ఉంది. సెలవు కావడంతో గత ఆదివారం కృష్ణమూర్తి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. 
 
అయితే, తల్లిదండ్రులు వ్యక్తిగత పనుల మీద సోమవారం హైదరాబాద్ బయలుదేరారు. తనకు విజయవాడలో పని ఉందని ఇక్కడే మరో రెండు రోజులు ఉంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే, మంగళవారం ఉదయం కృష్ణమూర్తి ఫోన్ తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి సాయంత్రం ఇంటి సమీపంలోని బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. 
 
బంధువు వెళ్లినప్పుడు గేటుకు బయట తాళం వేసి ఉంది. అనుమానంతో తాళం తీసి పై అంతస్తులో ఉన్న ఇంటికి చేరుకున్నాడు. కిటికీలోంచి చూడగా గదిలో ఉరికి వేలాడుతూ కృష్ణమూర్తి కనిపించాడు. దాంతో అతను కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
 
మృతుడు కృష్ణమూర్తి వేసుకున్న టీ షర్టులో పోలీసులు సూసైడ్ నోట్ లభించింది. బిల్డర్ మహేష్ తమ దగ్గరి నుంచి బలవంతంగా విలువైన ఆస్తిని తీసుకోవడంతో మనస్తాపానికి గురైనట్లు అతను ఆ సూసైడ్ నోట్‌లోరాశాడు. మహేష్ ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీసుకున్నారు.