Nov 5 నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు : కేసీఆర్
నవంబర్ ఐదో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దాదాపు నెల రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ‘మైక్రో ఇరిగేషన్’ విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కేబినెట్ సమావేశ నిర్ణయాలను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్ తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడించారు.
డ్రిప్, స్ర్పింకర్ల కోసం రూ.300 కోట్లు కేటాయించామని, ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ‘విజయ’కు పాలు పోసే రైతుకు లీటర్కు రూ.4 ప్రోత్సాహం ఇస్తామని, ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకూ హెల్త్కార్డులు అందజేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.