శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అక్రమ బంధానికి అడ్డున్నాడనీ.. మటన్ పేరుతో భర్తను హత్య చేయించిన భార్య...

తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో మరో వివాహేతర హత్య జరిగింది. గతంలో నాగర్ కర్నూలులో ఓ మహిళ కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హత్య చేయించిన విషయంతెల్సిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో హత్య జరిగింది. భర్తను మటన తీసుకుని రమ్మని బయటకు పంపిన భార్య.. తన ప్రియుడుని పురిగొల్పి హత్య చేయించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని రేగడితండా, మంగలికాలనీకి చెందిన ఇన్నారపు నవీన్, శాంతి అనే దంపతులు ఉన్నారు. వీరికి పిల్లలులేరు. ఈ క్రమంలో శాంతికి అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తితో వివాహేతర పరిచయం ఏర్పడింది. ఇది భర్తకు తెలియడంతో భార్యను నిలదీశాడు. దీంతో కట్టుకున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన శాంతి... తన ప్రియుడితో తలిసి ప్లాన్ వేసింది. 
 
అందులో భాగంగా గత నెల 21న రేగడితండాలోని తన తల్లి ఇంటికి వెళ్లి మటన్ తీసుకురావాల్సిందిగా భర్తను పంపింది. భార్య పన్నాగం తెలియని నవీన్ స్కూటీపై రేగడితండా బయలుదేరాడు. దారిలో కాపుకాసిన శాంతి ప్రియుడు వెంకటేశ్, అతడి స్నేహితుడు పద్దం నవీన్‌లు నవీన్‌పై దాడిచేసి, ఇనుప రాడ్డుతో తలపై మోది హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు స్కూటీని అతడిపై వేసి అక్కడి నుంచి పరారయ్యారు. 
 
అయితే, తన వదిన శాంతి వ్యవహారం తెలిసిన నవీన్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలం నుంచి సేకరించిన మద్యం సీసాలపై ఉన్న బార్‌కోడ్, సెల్‌ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.