గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (10:12 IST)

కొసరు ఇంట్లో పడుకుంటే... అసలింటికి దొంగల ఎసరు.. ఎక్కడ?

పడుకోవడానికి అనువుగా ఉంటుందని రెండిళ్లు ఉన్న యజమాని ఒకరు మరో ఇంట్లో పడుకున్నారు. ఇదే అతని పాలిట అశనిపాతమయ్యింది. దొంగలు అసలు ఇంటిని లూటీ చేసేశారు. తెల్లవారి వచ్చి చూస్తే ఇల్లు  గుల్లయ్యింది. బీరువాలు ఖాళీ అయ్యాయి. దొరికిందల్లా దోచుకుని దుండగులు పరారయ్యారు. శ్రీకాకుళంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలంలోని కొత్తకుంకాం గ్రామానికి చెందిన పిడుగు రాంబాబుకు డాబా ఇంటితోపాటు పెంకిటిల్లు ఉంది. డాబా ఇంటిని కాస్త చక్కగా ఉంచుతూ.. ఎక్కువగా పెంకిటింట్లోనే వంటలు చేసుకుని రాత్రులు అక్కడే పడుకుంటుంటారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి రాంబాబు కుటుంబ సభ్యులు డాబా ఇంటికి తాళం వేసి తమ పెంకిటింట్లో పడుకున్నారు. సరిగ్గా ఈ పరిస్థితి దొంగలకు కలిసొచ్చింది. 
 
డాబా ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని నిర్ధారించుకున్న దుండగులు, ఇంటి తాళాలు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇనుప బీరువాను విరగ్గొటి అందులో ఉన్న మూడున్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఆదివారం ఉదయం రాంబాబు కుటుంబ తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు విరగొట్టి ఉండటంతో విషయం అర్థమైంది. బీరువా విరగొట్టి అందులో ఉన్న బంగారం చోరీకు గురైనట్లు గుర్తించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.