శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (12:33 IST)

ప్రార్థనలు చేశారు.. ప్రభువు పిలుస్తాడనీ ఉరేసుకున్నారు.. ఎక్కడ?

మూఢభక్తి ముగ్గురి ప్రాణాలు తీసింది. ఉదయాన్నే ప్రార్థనలు చేసిన ముగ్గురు మహిళలు ప్రభువు పిలుస్తున్నాడనీ ఉరేసుకుని బలవన్మరణానికి పాలపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కరపలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరి

మూఢభక్తి ముగ్గురి ప్రాణాలు తీసింది. ఉదయాన్నే ప్రార్థనలు చేసిన ముగ్గురు మహిళలు ప్రభువు పిలుస్తున్నాడనీ ఉరేసుకుని బలవన్మరణానికి పాలపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కరపలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
కరప గ్రామం నీలయ్యతోటలో అక్కాచెల్లెళ్లు రాసంశెట్టి సత్యవేణి (48), సత్తి ధనలక్ష్మి (45)వారి కుటుంబాలతో కలిసి పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. 8 యేళ్ళ క్రితం వీరంతా క్రైస్తవమతాన్ని స్వీకరించారు. అప్పటినుంచి వీరి వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. ఇరుగుపొరుగువారితో మితంగా మాట్లాడటం, పెళ్లిళ్లు, ఫంక్షన్‌లకు వెళ్లకపోవడం, ఇల్లు, చర్చిల్లో ప్రార్థనలు చేసుకుంటూ గడపసాగారు. 
 
ఈ క్రమంలో రాసంశెట్టి సత్యవేణి భర్త శ్రీనివాస్‌ రెండేళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో మృతిచెందగా సత్యవేణి తన ఇద్దరు కుమారులు హరిబాబు, శేఖర్‌లతో కలిసి జీవిస్తోంది. చెల్లెలు సత్తి ధనలక్ష్మి భర్త శ్రీను తాపీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కూతురు వైష్ణవి (18), కొడుకు రఘువీర్‌ ఉన్నారు. తల్లి కరెడ్ల చంద్రం వీరితోపాటు ఉంటుంది. 
 
ఆదివారం రఘువీర్ పుట్టిన రోజు కావడంతో ఇంట్లోనే ఏసు ప్రభువు కూటమి పెట్టుకున్నారు. ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల తర్వాత ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అప్పటి నుంచి సత్యవేణి, ధనలక్ష్మి, వైష్ణవి ఏసుప్రభువు పరలోకానికి రమ్మని పిలుస్తున్నాడని, ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ప్రారంభించారు.
 
ఈక్రమంలో ఆదివారం అర్థరాత్రి ముగ్గురూ వీధుల్లో పరిగెడుతూ స్పిరిట్‌ అండ్‌ ట్రూత్‌ఫుల్‌ గోస్పల్‌ చర్చికి వెళ్లారు. రాత్రంతా అక్కడే ఉండి తెల్లారి ఇంటికి వచ్చాక కూడా వీళ్లు ఏదేదో మాట్లాడుతూ కుటుంబసభ్యులను భీతిల్లేలాచేశారు. ఇంట్లో ఉన్న దుష్టశక్తులను పారదోలుతామంటూ గదిలోకి వెళ్లి గడియపెట్టుకుని ప్రార్థనలు మొదలెట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తల్లి కరెడ్ల చంద్రం, ధనలక్ష్మి కుమారుడు రఘువీర్‌ వారించినా వినిపించుకోలేదు. 
 
కొద్దిసేపటికి గదిలో ప్రార్థనలు ఆగిపోవడంతో అనుమానం వచ్చిన రఘువీర్‌ తలుపు తీయాలని కేకలు వేశాడు. అయినా స్పందన రాకపోవడంతో ఇంటి వెనుకవైపు ఉన్న తలుపులను ఊడతీసి లోపలికి వెళ్లాడు. అప్పటికే ముగ్గురూ చీరకొంగులకు వేలాడుతూ విఘతజీవులుగా కనిపించారు. ఈ హఠాత్పరిణామంతో కుటుంబ సభ్యులతో పాటు.. స్థానికులు భీతిల్లిపోయారు. 
 
ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఒకేసారి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంలో సంచలనమైంది. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలముకున్నాయి.