శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 25 మే 2015 (20:55 IST)

పావు కేజీ పిట్ట మాంసానికి ముప్పావు కేజీ మసాలా.. ఇదీ మోడీ పాలన : తులసి రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం యేడాది పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. మోడీ యేడాది పాలన 'పావు కేజీ పిట్ట మాంసానికి ముప్పావు కేజీ మసాలా' అన్నట్టు సాగిందని ఆయన ఎద్దేవా చేశారు.
 
ఓ టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ ప్రధాన మంత్రి పదవిలో కంటే విదేశాంగ శాఖా మంత్రిగా బాగా రాణిస్తారని ఎద్దేవా చేశారు. సుష్మాస్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రి అనే విషయం మరచిపోయి, తానే విదేశాంగ మంత్రిగా ప్రధాని వ్యవహరిస్తున్నారని దెప్పిపొడిచారు. 
 
నరేంద్ర మోడీ నెలకో పథకం పేరిట స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, టీమిండియా, జనధన్ యోజన అంటూ ఘనంగా ప్రారంభించడమైతే చేశారు కానీ, ఆయన ఏదీ బాధ్యతగా తీసుకోలేదని, ఆయా కార్యక్రమాలను బాధ్యతగా పూర్తి చేయడం లేదని విమర్శించారు.
 
ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ప్రమాణాలు, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు విభజన చట్టంలోని అంశాలను మాత్రమే నెరవేరుస్తామన్నారా? అని ప్రశ్నించారు. మోడీ మాటమీద నిలబడే మనిషి కాదని ఆయన స్పష్టం చేశారు. మోదీ పాలన 'మేడిపండు చూడ మేలిమై ఉండ పొట్టవిప్పి చూడ పురుగులుండ' అన్నట్టు ఉందని తురసి రెడ్డి మండిపడ్డారు.