శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (09:05 IST)

అమీర్‌పేట్ కేసులో మాజీ గవర్నర్‌కు తప్పని చిక్కులు

హైదరాబాద్‌లోని అమీర్‌పేట భూ బదలాయింపు కేసులో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు చిక్కులు తప్పేలాలేవు. ఆయన పాత్రపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది.

హైదరాబాద్‌లోని అమీర్‌పేట భూ బదలాయింపు కేసులో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు చిక్కులు తప్పేలాలేవు. ఆయన పాత్రపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవిగా పరిగణించిన సుప్రీంకోర్టు… కేసు విచారణను ఆరు నెలలకు వాయిదా వేసింది. 
 
ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే 2009-10 మధ్యకాలంలో ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలో 9.5 ఎకరాల భూమిని డీనోటిఫై చేస్తూ సంతకం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రోశయ్యకు వ్యతిరేకంగా పిటిషనర్‌ కె.మోహన్‌లాల్‌ గతంలో ఏసీబీకోర్టును ఆశ్రయించారు. 
 
ఏసీబీ కోర్టులో విచారణను సవాల్‌ చేస్తూ రోశయ్య హైకోర్టు తలుపుతట్టారు. రోశయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా కేసు కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ 2016లో సుప్రీంను ఆశ్రయించారు. అయితే, గతంలో పలుమార్లు ఈ కేసు విచారణ జరిగినప్పటికీ.. రోశయ్య ఆ సమయంలో తమిళనాడు గవర్నర్‌గా ఉండటంతో కోర్టు నోటీసులు పంపలేదు. 
 
ఈ క్రమంలో తాజాగా ఈ కేసు బుధవారం జస్టిస్‌ రంజన్‌ గొగోరు, జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఆరోపణలు తీవ్రమైనవిగా పరిగణించిన ధర్మాసనం.. కేసు విచారణను ఆరు నెలల పాటు వాయిదా వేసింది.