ఏపీ, తెలంగాణల మధ్య నేడు విద్యుత్ శాఖ పంపకాల పంపిణీ
విద్యుత్తుశాఖకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఆస్తులు, అప్పుల పంపకాలపై మంగళవారం రెండు రాష్ట్రాల జెన్కో, ట్రాన్స్కో సీఎండీలు సమావేశం కానున్నారు. ఇప్పటికే ఒకసారి వారు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య పరస్పర బకాయిలపై చర్చించారు.
తెలంగాణ డిస్కమ్లకు ఏపీ బకాయిలపై ఒక విధంగా.. ఏపీజెన్కోకు తెలంగాణ డిస్కమ్ల బకాయిలపై మరోరకంగా లెక్కలు కట్టారు. దీనివల్ల రూ.900 కోట్ల మేర వ్యత్యాసం కనిపిస్తోందని, ఒకేరకంగా లెక్కిస్తే, తెలంగాణ నుంచి ఆ సొమ్ము తమకు వస్తుందని ఏపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో విజయానందర్ న్యాయనిపుణుల అభిప్రాయం కూడా తీసుకున్నారు. కాగా, పంపకాలపై కేపీఎంజీ కన్సల్టెన్సీ రెండు రాష్ట్రాలకూ నివేదిక ఇచ్చింది.
విభజన చట్టం ప్రకారం పంపిణీకి తెలంగాణ సంస్థ సమ్మతించకపోతే రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, అప్పుల విభజనను పరిశీలిస్తున్న షీలాభిడే కమిటీకి నివేదించాలని ఏపీ యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఏపీలోని కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రంపై కేంద్రం అభిప్రాయం కోసం వేచిచూడాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఈలోగా భూపాలపల్లిలో నిర్మిస్తున్న కేటీపీపీ-2, ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి కాలరీస్ నిర్మిస్తున్న థర్మల్ కేంద్రాలకు కొత్త కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుని ఈఆర్సీకి సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది.