మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 5 మే 2017 (16:50 IST)

రిపీట్ అయిన ఠాగూర్ సినిమా - మృతిచెందిన వ్యక్తికి చికిత్స ఆరు లక్షల బిల్లు.. ఎక్కడ?

సరిగ్గా ఠాగూర్ సినిమా మరోసారి రిపీట్ అయ్యింది. చనిపోయిన వ్యక్తికి మూడురోజుల పాటు ట్రీట్మెంట్ చేసి 6లక్షల రూపాయల బిల్లు వేశారు ఒక ప్రైవేటు హాస్పిటల్ వైద్యులు. డబ్బులిస్తే తప్ప మృతదేహాన్ని ఇవ్వమని తేల్చిచెప్పారు. బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగినా

సరిగ్గా ఠాగూర్ సినిమా మరోసారి రిపీట్ అయ్యింది. చనిపోయిన వ్యక్తికి మూడురోజుల పాటు ట్రీట్మెంట్ చేసి 6లక్షల రూపాయల బిల్లు వేశారు ఒక ప్రైవేటు హాస్పిటల్ వైద్యులు. డబ్బులిస్తే తప్ప మృతదేహాన్ని ఇవ్వమని తేల్చిచెప్పారు. బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగినా వైద్యుల మనస్సు మాత్రం కరగలేదు. శవాలపై చిల్లర ఏరుకునే ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకం అంతాఇంతా కాదు.
 
వైద్యో నారాయణో హరి అని అందరూ అనుకుంటారు. కానీ ప్రస్తుతం వైద్యుడు దగ్గరికి వెళితే తిరిగి ఇంటికి వెళతామా అన్నది అనుమానమే. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరితే బాగు చేయాల్సిన వైద్యులు..డబ్బులకు కక్కుర్తి పడి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. మరికొంతమంది వైద్యులయితే చనిపోయిన వారికే ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లు నటించి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఠాగూర్ సినిమాలో ఒక చనిపోయిన రోగిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళితే వారు డబ్బుల కోసం చేసే హడావిడి అంతా కాదు. 
 
ఇలాంటి సంఘటనే తిరుపతిలో కూడా జరిగింది. నెల్లూరు జిల్లా పెలకూరు మండలం పునబాక గ్రామానికి చెందిన గంగాధరం అనే రైతు పంటలు పండకపోవడంతో పురుగుల మందు తాగాడు. పురుగుల మందు తాగిన గంగాధరంను శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే అక్కడి వైద్యులు తిరుపతికి తీసుకెళ్ళమని సలహా ఇవ్వడంతో ఆంబులెన్స్‌లో హడావిడిగా తిరుపతి-రేణిగుంట రోడ్డులోని నారాయణాద్రి ఆసుపత్రికి తీసుకొచ్చి చేర్పించారు. గత నెల 24వ తేదీన గంగాధరంను బంధువులు నారాయణాద్రి ఆసుపత్రిలో చేర్పించారు.
 
గంగాధరంను ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుంచి కేవలం మెడిసిన్స్‌కే 2 లక్షల రూపాయల బిల్లులు వేశారు ఆసుప్రతి వైద్యులు. ప్రతిరోజు 8 వేల రూపాయల విలువ కలిగిన 4 ఇంజక్షన్లను గంగాధరంకు వేసేశారు. గంగాధరం ఆరోగ్యం బాగానే ఉందని కోలుకుంటున్నాడని ఆసుపత్రి వైద్యులు బంధువులకు చెబుతూ వచ్చారు. గత నెల 24వ తేదీ నుంచి గంగాధరం చనిపోయేంత వరకు బంధువులెవరినీ ఐసియులోకి అనుమతించలేదు వైద్యులు. అయితే నిన్న ఉదయం గంగాధరం కళ్ళు తెరిచాడని చెప్పిన వైద్యులు సాయంత్రానికల్లా చనిపోయాడని చెప్పారు. మొత్తం 6 లక్షల రూపాయల బిల్లు అయ్యిందని దాన్ని కట్టిన తరువాతనే మృతదేహాన్ని తీసుకెళ్ళాలని వైద్యులు తేల్చిచెప్పారు.
 
గంగాధరం మూడురోజుల క్రితమే మృతి చెందినట్లు మృతుని బంధువులకు ఆసుపత్రిలో పనిచేసే ఒక సిబ్బంది సమాచారమిచ్చాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న బంధువులు మృతి చెందిన వ్యక్తికి చికిత్స చేస్తారా అంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నారాయణాద్రి ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బంధువులు. సిపిఐ నేతలు కూడా మృతుని బంధువులకు బాసటగా నిలిచి ఆందోళనలో పాల్గొన్నారు.