గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (12:07 IST)

కేంద్ర బడ్జెట్ మీద కవిత స్పందన!: తెలంగాణకు కొత్త రైళ్లు ఇవ్వలేదు!

తెలంగాణకు కొత్త రైళ్లు ఇవ్వలేదు, ప్రాజెక్టులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ తమను నిరాశకు గురి చేసిందని కవిత తెలిపారు. భారీ మెజారిటీ ఉన్న ఎన్‌డిఏ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సంస్కరణలను ప్రతిపాదించలేకపోయిందని దుయ్యబట్టారు. 
 
కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ఆర్థిక సహాయం అందజేయటంలోనూ, దిశ చూపించటంలో కేంద్రం విఫలమైందన్నారు. ధనికులపై ఎక్కువ పన్నులు విధించి పేద ప్రజలపై తక్కువ పన్నులు వసూలు చేయాలని కవిత సూచించారు. గురువారం లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆమె, దేశంలోని ధనమంతా కొందరు వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమవుతోందని అన్నారు.
 
లోక్‌సభలో ప్రతిపక్షమనేదే లేకుండా పోయింది అయినా ఎన్‌డిఏ ప్రభుత్వం మాత్రం దేశానికి అవసరమైన ఆర్థిక తదితర సంస్కరణలను అమలు చేయలేకపోతోందని విమర్శించారు. ఎన్‌డిఏ బడ్జెట్‌కు గతంలో యుపిఏ ప్రతిపాదించిన బడ్జెట్‌లకు ఎలాంటి తేడా లేదని చెప్పారు. 
 
యుపిఏ ప్రభుత్వం ఉత్పాదక రంగానికి అన్యాయం చేసిందని ఎన్నికల ప్రచారంలో ఆరోపించిన మీరు ఉత్పాదక రంగానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదని కవిత నిలదీశారు.