శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2019 (18:34 IST)

తెలంగాణాలో రాజ్యాంగ సంక్షోభం... వైస్రాయ్ హోటల్ ఘటన పునరావృతమా?

తెలంగాణ రాష్ట్ర సర్కారును ఆ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కుదిపేస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకుదిగి 13 రోజులు అయింది. అటు ప్రభుత్వం, ఇటు, కార్మిక సంఘాల నేతలు ఏమాత్రం పట్టువీడటం లేదు. ప్రభుత్వం కూడా కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యమ సంఘాల కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ విమర్శలు చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో.. నేనే రాజు, నేనే మంత్రి అంటే కుదరదంటూ హెచ్చరించారు. సీఎం పదవి ఎవరికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. 
 
సమ్మె సమస్య పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చని.. గతంలో జరిగిన వైస్రాయ్ ఘటనను మర్చిపోకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె విషయంపై తనతో పలు పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని.. వారిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని అశ్వత్థామ రెడ్డి చెప్పారు. సమ్మెపై మంత్రులు హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌, జగదీశ్‌ రెడ్డి, కేటీఆర్‌లు మౌనం వీడాలని కోరారు. ఆర్టీసీ అంశంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టులో ఎండగడతామని చెప్పారు.
 
అలాగే, ఆర్టీసీ సమ్మె విషయంలో మేథావులు మౌనంగా ఉండటం మంచిది కాదన్నారు. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ, ప్రభుత్వం వైపు నుంచే సానుకూలత లేదని ఆయన ఆరోపించారు.