గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (08:00 IST)

కన్న పిల్లలకు, ప్రియుడికి విషమిచ్చి.. తాను విషం తాగి

ప్రియుడి తోడుకు అడ్డువస్తున్నారనుకున్న ఓ కసాయి తల్లి కన్న పిల్లలకే విషమిచ్చింది. ఆపై.. భయపడి ప్రియుడితో కలసి పురుగుల మందు తానూ తాగింది. కుటుంబ కలహాలతో బతుకు బజారుకీడ్చుకున్న ఆ యువతి ఒక కూతర్ని పోగొట్టుకుని, చావు బతుకుల మధ్య మరో కూతురు, ప్రియుడితో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. వివరాలివి..
 
తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మట్టెగజపు లింగయ్య కుమార్తె కవితతో సూదనపల్లికి చెందిన తోట పాపయ్యకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తెలు గీతిక(4), సాయి దీప్తి జన్మించారు. వీరు కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ కూలీ చేసుకుంటున్నారు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. బ్యాంకు అకౌంట్ తీసేందుకని ఇటీవల స్వగ్రామం చేరుకున్నారు. 
 
15వ తేదీన వారు మానుకోటలోని ఓ బ్యాంకులో అకౌంట్ తీసేందుకు వెళ్లి, ఖాతా తెరవకుండానే తిరిగొచ్చారు. అదే రోజు కవిత తన భర్తకు తెలియకుండా ఇద్దరు కుమార్తెలను తీసుకుని చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిందని భావించిన పాపయ్య హైదరాబాద్ వెళ్లేందుకు ఆది వారం బయల్దేరాడు. 
 
సూదనపల్లి నుంచి పిల్లలను తీసుకుని బయల్దేరిన కవిత నేరుగా తన మేనత్త ఊరైన నూతనకల్ మండలంలోని జి.కొత్తపల్లికి వెళ్లింది. అనంతరం తన మేనత్త కుమారుడు శ్రీపాల్‌తో కలిసి కూతుళ్లకు పురుగుల మందు తాగించి హత్య చేయాలని పథకం రచించింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-చిట్యాల మధ్యలో ఉన్న గుట్ట వద్ద పిల్లలిద్దరికి వారు పురుగుల మందు తాగించారు. దీంతో పెద్దకుమార్తె గీతిక అక్కడికక్కడే మృతిచెందగా, సాయిదీప్తి పరిస్థితి విషమంగా మారింది. 
 
అనంతరం కవిత, శ్రీపాల్ కూడా పురుగుల మందు తాగి సారుుదీప్తిని తీసుకుని ప్రధాన రహదారికి చేరుకున్నారు. అక్కడి నుంచే శ్రీపాల్ తన తమ్ముడు శ్రీనుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా, అతడు వెంటనే కవిత తండ్రి లింగయ్యకు సమాచారమిచ్చాడు. దీంతో లింగయ్య సంఘటన స్థలానికి వెళ్లి చూడగా గీతిక మృతదేహం కనిపించింది. సాయిదీప్తి, కవిత, శ్రీపాల్ అంబులెన్స్‌లో హైదరాబాద్ సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్ళారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.