శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (12:13 IST)

చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు.. అల్టిమేటం జారీ చెయ్యాలి!

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్డీఏ సర్కారుకు అల్టిమేటం జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన అనంతరం కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే, నరేంద్ర మోడీ కేబినెట్ నుంచి తన పార్టీ మంత్రలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
  
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓ వైపు రాజకీయంగా వాడీవేడీ చర్చ సాగుతుండగానే, మరోపక్క గుంటూరుకు చెందిన సంజీవరావు అనే యువకుడు ఉద్యమ బాట పట్టాడు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కూడా లేని ఏపీ, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
 
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే కొంతలో కొంతైనా మేలు జరుగుందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంజీవరావు నిన్న గుంటూరులోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ను ఎక్కాడు. రాత్రంతా సెల్ టవర్ పైనే ఉన్న సంజీవరావు, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే కాని కిందకు దిగనని మొండికేస్తున్నాడు. అతనిని కిందకు దించేందుకు పోలీసులు చేస్తున్న యత్నాలు ఫలించడం లేదు.