బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 2 ఫిబ్రవరి 2017 (05:56 IST)

జైట్లీ దెబ్బకు ఏపీ డమాల్ : టీడీపీ ఎంపీలు చప్పట్లే చప్పట్లు.. తోడుగా బాబు దరహాసం

మోదీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్‌కు వరాల జల్లు కురిపించనుందంటూ బడ్జెట్‌ ప్రకటించడానికి రెండు రోజుల ముందు హల్‌చల్ చేసిన వార్తలను చూసి యధాప్రకారమే రాష్ట్ర ప్రజానీకం మురిసిపోయింది. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోను, విద్యాసంస్థలు, అదనపు సహాయాలు, రైల్వే లైన్లు

మోదీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్‌కు వరాల జల్లు కురిపించనుందంటూ బడ్జెట్‌ ప్రకటించడానికి రెండు రోజుల ముందు హల్‌చల్ చేసిన వార్తలను చూసి యధాప్రకారమే రాష్ట్ర ప్రజానీకం మురిసిపోయింది. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోను, విద్యాసంస్థలు, అదనపు సహాయాలు, రైల్వే లైన్లు, రాజధాని నిర్మాణం కోసం భారీ నిధులు, కొన్ని పత్రికలు, చానళ్లు అయితే ప్రజలకు స్వర్గం చూపించేశాయి. కేంద్రం ఈసారి బడ్డెట్లో ఏపీని ఎక్కడికో తీసుకెళుతోందన్న అభిప్రాయం కలిగించేశారు. ఏపీకి కేంద్రం కలిగించనున్న ప్రయోజనాల గురించి తెలుసుకుని పవన్ కల్యాణ్ అంతటోడే డిఫెన్సులో పడిపోయాడు అనేంత రేంజిలో రాసిపడేశాయి కొన్ని పత్రికలు. కానీ బుధవారం జైట్లీ ప్రకటించిన బడ్జెట్ ఆంధ్రకు ఏమిచ్చింది అంచే ఎన్టీఆర్ మాటల్లో చెప్పాలంటే కాసింత బూడిద ఇచ్చిందనే చెప్పవచ్చు. 
 
రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటులో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎలాంటి ఊరట కలిగించలేదు. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీల ప్రస్తావన అసలే లేదు. 
 
విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడం, రెవెన్యూ లోటు భర్తీ వంటి ముఖ్యమైన హామీలను సైతం ఈ బడ్జెట్‌లో విస్మరించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ఏర్పాటుకు నిర్దిష్ట కేటాయింపులు జరపలేదు. మిగిలిన మెట్రోల్లో కలిపి కేటాయింపులు చూపారు. 
 
బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా అధికార టీడీపీ ఎంపీలు ఒక్కరు కూడా నిరసన తెలిపిన దాఖలాలు లేవు. పైపెచ్చు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ బల్లలు చరచడం పట్ల వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
 
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కొత్తగా సంస్థలను, ఆర్థిక సాయాన్ని ప్రకటించలేదు. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల పరిధిని పెంచాలన్న డిమాండ్‌పై బడ్జెట్‌లో పరిష్కారం చూపలేదు. జాతీయస్థాయి విద్యాసంస్థల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు కావాల్సి ఉన్నప్పటికీ అరకొరగా నిధులు విదిల్చారు.
 
హోదా సాధన కోసం రాష్ట్రంలో ప్రజా పోరాటాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో దాని గురించి ఏదైనా ప్రకటన చేస్తారని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. అయినా టీడీపీ నాయకులు నోరుమెదపక పోవడం గమనార్హం. ఏపీకి హోదా కంటే ప్యాకేజీ మేలన్న చంద్రబాబు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో కేంద్రం దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు పూర్తిగా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిధులు మాత్రం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. ఈ బడ్జెట్‌లో రాజధాని నిర్మాణం ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. రాష్ట్ర ప్రజలు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న విశాఖ రైల్వే జోన్‌ ఊసూ లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనే కనిపించలేదు. 
 
కేంద్రం మొండివైఖరితో ఆంద్రకు బడ్జెట్లోనూ అన్యాయం జరుగుతూంటే పార్లమెంటులో టీడీపీ ఎంపీలు నోరెత్తకపోగా బల్లలు చరిచి మరీ జైట్లీ ప్రసంగానికి పరవశించిపోవడం గమనార్హం.