శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (15:02 IST)

'అవిశ్వాసం' వార్నింగ్‌తో కేంద్రంలో కదలిక : ఏపీ సీఎస్‌కు ఢిల్లీ పిలుపు

రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్రం వెనుకంజ వేసింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్రం వెనుకంజ వేసింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా, విపక్ష వైకాపా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ప్రధాని మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుండగా, అవిశ్వాసం అనేది చివరి అస్త్రంగానే ఉపయోగించాలని అధికార టీడీపీ అంటోంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్రంలో కదలిక వచ్చింది. విభజన హామీలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ నుంచి కబురొచ్చింది. ఈనెల 23వ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా కోరింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన విభజన హామీలపై సమీక్షలో పాల్గొనాల్సిందిగా కోరింది. 
 
అంతేకాకుండా, పూర్తి సమాచారంతో రావాలని ఏపీ సీఎస్‌కు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రైల్వే జోన్, రెవెన్యూలోటు, ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం పోర్టు, 9, 10వ షెడ్యూల్‌ సంస్థల విభజనపై సమావేశంలో చర్చ జరుగనుంది. అలాగే 9, 10వ షెడ్యూల్‌ సంస్థల విభజనకు సంబంధించి చర్చించేందుకు సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి కూడా కేంద్రం హోంశాఖ కోరింది.