విశాఖ బీచ్లో స్వచ్ఛ భారత్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు!
విశాఖపట్టణంలోని ఆర్.కే బీచ్లో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఆయనతో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావులు కూడా పాల్గొని బీచ్ను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రతి భారతీయుడు 'స్వచ్ఛ భారత్'లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2019 నాటికి పరిశుభ్ర భారత్ కోసం అందరూ పాటుపడాలని కోరారు.
అలాగే, విశాఖ బీచ్ సముద్రపు కోతకు గురికాకుండా ఉండేందుకు పర్యావరణ శాఖతో సంప్రదింపులు జరిపి, సముద్ర కోత నుంచి రక్షించేలా శాశ్వత చర్యలు తీసుకుంటామని వెంకయ్య హామీ ఇచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని, హుదూద్ తుఫాను కారణంగా అపరిశుభ్రంగా మారిన విశాఖ బీచ్ను వారు శుభ్రం చేశారు.