బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (09:13 IST)

ప్రత్యేక హోదా సంజీవిని కాదు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు

ప్రత్యేక హోదా సంజీవిని కాదనీ, దాంతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పైగా.. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు నీతి ఆయోగ్ పరిశీలిస్తోందని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా పోయిన తర్వాత వారికి (కాంగ్రెస్) ప్రత్యేక హోదా గుర్తొంచింది అంటూ కాంగ్రెస్‌ నేతలను ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను ఎందుకు పట్టించుకోలేదు. చట్టంలో ఎందుకు పెట్టలేదు. ఎన్నికల ముందు హామీ ఇస్తే సరిపోతుందా అంటూ కాంగ్రెస్‌ను నిలదీశారు.
 
ఇకపోతే.. ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ పరిష్కారం కావు. అయితే హోదా వల్ల మేలు జరుగుతుంది. అందుకే ఈ హోదాను నేనే కోరాను. ఇంతకుముందు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. వాటి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. మోడీ సూచన మేరకు నీతి ఆయోగ్‌ అధ్యయనం చేశాక ఏ నిర్ణయం వస్తుందో చూడాలని అన్నారు. 
 
ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నం చేస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో కరెంట్‌ కోత లేకుండా చేస్తున్నాం. ఏపీలో విద్యుత్‌ సమస్య తొలగిపోయింది. తెలంగాణలో ఈ సమస్య తీరాల్సి ఉంది. తెలుగు ప్రజల వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.