శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 1 మార్చి 2015 (14:26 IST)

తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది : వెంకయ్య అంగీకారం

రైల్వే, వార్షిక బడ్జెట్‌లలో రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన మూకుమ్మడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని వెంకయ్య ఒప్పుకోవాల్సి వచ్చింది.
 
నిజానికి వెంకయ్య మంచి వాగ్ధాటి ఉన్న మేటి రాజకీయవేత్త. తన వాక్చాతుర్యంతో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న ఆయన.. హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో ఇబ్బంది పడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై విలేకరులు వెంకయ్యపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్ల నిధుల కేటాయింపులపై మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా ప్రశ్నలు సంధించారు. 
 
దీంతో తీవ్రంగా ఇబ్బంది పడిన వెంకయ్య, తన పదునైన సమాధానాలతో ఎదురుదాడి చేసేందుకు యత్నించారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై వెంకయ్య సమాధానం చెప్పలేక సతమతమయ్యారు. అంతేకాక పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులపైనా మీడియా ప్రతినిధులు వెంకయ్యను తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఆయన తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని అంగీకరించక తప్పలేదు.