గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 4 జులై 2015 (07:46 IST)

వీరేశలింగం పంతులు భూములు...! హాం ఫట్.. !! ఎక్కడ ? ఎప్పుడు ?

ఆయనో సంఘ సంస్కర్త. రకరకాల జాడ్యాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమయంలో వితంతు వివాహాల ఉద్యమాన్ని తీసుకొచ్చారు. తన ఆశయ సాధన కోసం ఏర్పడిన హితకారిణి సంస్థకు తన స్వార్జితంతో భూములను వీరేశలింగం పంతులు సమకూర్చారు. ఆ భూములను కొందరు అక్రమార్కులు హాం...ఫట్ చేసేశారు. వారికి రెవెన్యూ కూడా వంత పాడేసింది. వివరాలిలా ఉన్నాయి. 
 
హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసిన కందుకూరి వీరేశలింగం పంతులు, ఆ సంస్థ కోసం తన స్వార్జితంతో రాజమండ్రిలో 19 ఎకరాల 29 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న రాజమండ్రి సర్వే రికార్డుల ప్రకారం.. సర్వే నెంబర్‌ 1943లో హితకారిణి సంస్థ పేరిట 19.29 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని సంరక్షించే బాధ్యతను దేవాదాయశాఖ చూసుకుంటోంది. 
 
అయితే కొన్నేళ్ల క్రితం ఈ భూమిని కొందరు వ్యక్తులు కబ్జాచేశారు. కబ్జాను కనిపెట్టి ఆక్రమణదారులను తరిమికొట్టాల్సిన బాధ్యత దేవాదాయశాఖతోపాటు రెవెన్యూ అధికారులపైనా ఉంది. కానీ, రెవెన్యూ అధికారులు.. 2008లో ఇద్దరు వ్యక్తుల పేరిట కొంత భూమిని రాసిచ్చేసి, పట్టాలు పంచిపెట్టి చేతులు దులుపుకున్నారు. రాజమండ్రి తహసిల్దార్‌ (అర్బన్‌) కార్యాలయం నుంచే పట్టాలు మంజూరయ్యాయి. పట్టాలు జారీ చేసేందుకు సర్వే రికార్డుల్లోనూ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. ఎలాంటి రీ సర్వే చేయకుండానే.. ఆ పనిచేసినట్టుగా 1943 సర్వే నెంబర్‌లో ఉన్న భూమిని రీ సర్వే నెంబర్‌ 253గా పేర్కొని ఇద్దరికి పట్టాలు మంజూరు చేశారు. దీనిపై సర్వే-సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌కు గత ఏడాది ఫిర్యాదులు వచ్చాయి. 
 
వాటిపై స్పందించిన నాటి డైరెక్టర్‌ విచారణకు ఆదేశించారు. కాకినాడ సర్వే శాఖ సహాయ సంచాలకులు విచారణ జరిపి ఈ ఏడాది జనవరిలో నివేదిక ఇచ్చారు. ఈ భూమికి పట్టాలు ఇచ్చిన తర్వాత అందుకు సంబంధించిన సర్వే ఫైలును మాయం చేశారని విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ భూమిలో ఇప్పటికే కొన్ని ఇళ్లు వెలిశాయి. 
 
హితకారిణి భూమి విషయంలో రెవెన్యూ, సర్వే అధికారులు కుమ్మక్కయి సర్వే రికార్డులను తారుమారు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై స్పందించిన లోకాయుక్త.. జిల్లా కలెక్టర్‌ను రెండేళ్ల క్రితమే నివేదిక కోరింది. కానీ, రెవెన్యూ ఉన్నతాధికారులు కొందరు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తప్పుచేసిన వారిని కాపాడేందుకు గట్టి ప్రయత్నం చేశారు.