కాంగ్రెస్ కుళ్లును ఒక్క యేడాదిలో కడిగిపారేయలేం : వెంకయ్య
దేశంలోసాగిన కాంగ్రెస్ యాభై ఏళ్ళ పాలనలో అన్ని వ్యవస్థలు కుళ్లుమయమయ్యాయని, ఆ కుళ్లును ఒక్క యేడాదిలోనే కడిగిపారేయలేమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తానా సభల్లో పాల్గొనే నిమిత్తం ఆయన అమెరికాలోని డెట్రాయిట్కు గురువారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తానా ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
కాగా అమెరికాలోని బీజేపీ ప్రవాస భారతీయ మిత్రులు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో వెంకయ్య ప్రసంగించారు. హెర్న్డన్లోని చిన్మయ - సోమనాథ్ లోటస్హాల్లో జరిగిన ఈ సమావేశానికి న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా, ఉత్తర కరొలినా తదితర రాష్ట్రాల నుంచి పలువురు ప్రవాస భారతీయులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ అన్ని వ్యవస్థలనూ కుళ్లబొడిచిందని.. ఈ కుళ్లును ఒక్క ఏడాదిలో కడిగిపారేయలేమన్నారు. దాదాపు గంటన్నరసేపు వెంకయ్య అనర్గళంగా ప్రాసలు, చలోక్తులు, విసుర్లతో చేసిన ప్రసంగం ప్రవాస భారతీయులను ఆకట్టుకుంది.