శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (02:50 IST)

కేశినేని నాని ఉంటే ఎంత పోతే ఎంత..! లగడపాటిని దువ్వుతున్న బాబు.. విజయవాడ ఎంపీ సీటుపై బ్రాహ్మణి కన్ను?

తెలుగుదేశం పార్టీతో కేశినేని బంధం తెగిపోయినట్లే కనిపిస్తోంది. గత అయిదారేళ్లుగా తెలుగుదేశం పార్టీకి ఆర్థికపరమైన వెన్నెముకల్లో ఒకరుగా నిలిచి ఆదుకున్న కేశినేని ట్రావెల్స్ అధినేత నాని టీడీపీతో తెగతెంపులకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీతో కేశినేని బంధం తెగిపోయినట్లే కనిపిస్తోంది. గత అయిదారేళ్లుగా తెలుగుదేశం పార్టీకి ఆర్థికపరమైన వెన్నెముకల్లో ఒకరుగా నిలిచి ఆదుకున్న కేశినేని ట్రావెల్స్ అధినేత నాని టీడీపీతో తెగతెంపులకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబుకు అవసరమైన సమయంలో ఆప్తమత్రుడిగా ఆదుకున్న నాని తన ట్రావెల్స్ విషయంలో అధినేత తనకు సపోర్టుగా లేకపోవడంతో గుండెపగిలి టీడీపీకి రాంరాం చెప్పెయ్యాలని  భావిస్తున్నట్లు సమాచారం.


దీంతో నానిపై నమ్మకం పోయిన చంద్రబాబు ఇదే అదనుగా ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్‌ని రంగంలోకి తీసుకొచ్చేశారు. పార్టీ ఎంపీలకు దర్శనం ఇవ్వడానికి కూడా తీరికలేని బాబు ఒక్కసారిగా లగడపాటిని పిలిచి మరీ భేటీ అయ్యారు. మరోవైపున ఈసారి విజయవాడ ఎంపీసీటును స్థానికులు ఎవరికీ కాకుండా తన కోడలు నారా బ్రాహ్మణికి కట్టబెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ వార్తలు రావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. 
 
తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో  భగ్గుమంటున్నాయి. ప్రత్యేకించి బెజవాడలో టీడీపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ట్రావెల్స్‌ వ్యవహారంలో ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమా... ముఖ్యమంత్రి వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. కాపుల గొంతు కోస్తున్నారంటూ బోండా ఉమా తన ఆగ్రహాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం వివాదంతో  ఎంపీ కేశినేని నానీకి... ముఖ్యమంత్రికి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రావెల్స్‌ మూసివేత నిర్ణయం వద్దని ముఖ్యమంత్రి వారించినా నాని మాత్రం ఆయన మాటను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో  పార్టీ కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటున్నారు.
 
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం రాత్రి అనూహ్యంగా వెలగపూడిలో సీఎంను కలవడం ....బెజవాడ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి. తాజా పరిణామాల నేపథ‍్యంలో కేశినేని నాని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడంతో పాటు, ఎంపీ సీటు కోసం భారీగానే మూల్యం చెల్లించారు. అవసరం ఉన్నంతవరకూ తనను వాడుకుని, ఇప్పుడు తనను కరివేపాకుగా విసిరిపారేయాలనే తలంపుతో తనకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యర్థిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ నాని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బెజవాడ రాజకీయాలు వేడెక్కిన తరుణంలో లగడపాటి రాజగోపాల్‌‌కి చంద్రబాబు భారీ ఆఫర్‌ ఇచ్చినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
 
మరో బాంబులాంటి వార్త ఏమిటంటే.. ఇటీవల చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణికి విజయవాడ ఎంపీ సీటు ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఇదే నిజమైన పక్షంలో రాజధాని అమరావతికి కేంద్రమైన విజయవాడ ప్రాంతం స్థానికుల చేతినుంచి స్థానికేతరుల గుప్పిట్లోకి పోవడం ఖాయమని టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.