లావణ్య మృతి కేసు... అది ఈవ్ టీజింగ్ కాదు... తాగిన మైకంలో కారుతో ఢీకొట్టారు... పోలీస్
విశాఖపట్నంలో ఆకతాయిల కీచకపర్వం వల్ల లావణ్య అనే వివాహిత మృతి చెందిన సంఘటనపై పోలీసులు కొత్త వెర్షెన్ వినిపిస్తున్నారు. లావణ్యను కావాలని ఆకతాయిలు ఢీకొట్టలేదని, తాగిన మైకంలో యువకులు కారు నడిపి బైక్ను ఢీకొట్టారని పోలీసుల చెపుతున్నారు.
విశాఖపట్నంలో ఆకతాయిల కీచకపర్వం వల్ల లావణ్య అనే వివాహిత మృతి చెందిన సంఘటనపై పోలీసులు కొత్త వెర్షెన్ వినిపిస్తున్నారు. లావణ్యను కావాలని ఆకతాయిలు ఢీకొట్టలేదని, తాగిన మైకంలో యువకులు కారు నడిపి బైక్ను ఢీకొట్టారని పోలీసుల చెపుతున్నారు. అనకాపల్లిలో బైకు మీద వెళుతున్న వివాహితను ఏడిపిస్తూ, కారుతో ఢీకొట్టి కొందరు పోకిరీలు పరారయ్యినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వివాహిత లావణ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటనలో వివాహిత లావణ్య భర్తకు, మరదలుకు గాయాలయ్యాయి. ఆకతాయుల వేధింపుల కారణంగానే లావణ్య మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపామని, ఇది ఆకతాయిల పని కాదని ఎస్పీ యోగానంద్ మీడియాకు చెప్పారు. హేమకుమార్, అతనితోపాటు హేమంత్ కుమార్ అనే ఇద్దరు కారులో వేగంగా వెళుతూ, టూవీలర్పై వెళుతున్న లావణ్య, ఆమె భర్త బైక్ని ఢీకొన్నారని చెపుతున్నారు.
ఆ సమయంలో హేమ కుమార్ సెల్ ఫోన్ మాట్లాడుతూ, కారు డ్రైవ్ చేస్తున్నాడని, పైగా వాళ్ళు తాగి ఉన్నారని తేల్చారు. కారు సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి బైక్ని ఢీకొనడం వల్ల లావణ్య మృతి చెందిందని, ఆమె రోడ్డుపై రక్తసిక్తంగా పడిపోయినా... హేమకుమార్ కారు ఆపకుండా వెళ్లిపోయాడని ఎస్పీ చెప్పారు. అతనిపై 304, 201 సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్టు చేశామన్నారు. అయితే హేమ కుమార్ ఈవ్ టీజింగ్ చేసినట్లు ఎవరి వద్ద అయినా ఆధారాలుంటే చూపవచ్చని ఎస్పీ యోగానంద్ చెప్పారు.