శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2016 (16:36 IST)

ఏడీజీ ర్యాంకులో ఉన్నా.. అంతకంటే తక్కువ పోస్టుకు ఎలా వస్తాను : లక్ష్మీనారాయణ

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసును తవ్వితీసిన సీబీఐ జాయింట్ డైరక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ. ఈయన మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసి. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఈయనను నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పోలీసు కమిషనర్‌గా నియమించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
వీటిపై లక్ష్మీనారాయణ బుధవారం స్పందిస్తూ తాను అమరావతి పోలీస్ కమిషనరుగా బాధ్యతలు చేపడుతున్నానని జరుగుతున్న ప్రచారంలో కించిత్ కూడా నిజం లేదన్నారు. ఆ ప్రచారమంతా తప్పుడు ప్రచారమేనని చెప్పారు. పైగా, ఈ విషయంలో తానేమీ ప్రయత్నాలు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చినా అంగీకరించబోనని చెప్పారు. దీనికి కారణం లేకపోలేదన్నారు. ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంకులో ఉన్న తాను అంతకంటే తక్కువ స్థాయి ర్యాంకు ఉన్న అధికారి చేపట్టాల్సిన అమరావతి పోలీస్ కమిషనర్ పదవిని ఎలా చేపడుతానని లక్ష్మీ నారాయణ వివరణ ఇచ్చారు.