మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జులై 2020 (16:42 IST)

మేము ఏ పార్టీకి అనుకూలంగా లేము : ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ లో తమనూ ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసి సర్వత్రా విమర్శల పాలైన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిఫెన్స్ లో పడిపోయారు.

తను పిటిషన్ వేయడానికి గల కారణంపై వివరణ ఇచ్చుకున్నారు. ఉద్యోగులకు, రాజకీయాలకు సంబంధం లేదని, తాము ఏ పార్టీకి అనుకూలంగా లేమని చెప్పారు.

రాజధాని బిల్లు పాసైతే కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని, అది కూడా విద్యా సంవత్సరంలో ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎవరిని తక్షణం రావాలని ఇబ్బందులు పెట్టొద్దని కూడా విజ్ఞప్తి చేశామని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు.

రాజధాని తరలింపు కోసం రూ.5 వేలు కోట్లు అవుతున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల సంఘం అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో హైకోర్టులో పిటిషన్లు వేశారని, ఉద్యోగులను అనవసరంగా హైకోర్టు పిటిషన్‌లో చొప్పించారని విమర్శించారు.

అందుకే ఉద్యోగులుగా హైకోర్టు పిటిషన్‌లో ఇంప్లీడ్ అయ్యామని తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌కు వాస్తవాలతో కూడిన సమాధానం కోర్టుకు చెప్పామన్నారు.