శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: సోమవారం, 24 జూన్ 2019 (14:57 IST)

ప్రజావేదిక రూ. 5 కోట్ల అక్రమ నిర్మాణం... నేనే దగ్గరుండి పండిపిండి కింద కొట్టించి కూల్చేస్తా... ఆళ్ల

ప్రజా వేదక తమకు కేటాయించాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తి సంగతి అలావుంచితే... అసలా వేదికే లేకుండా చేస్తానని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్మాణం అక్రమమైనదనీ, ప్రభుత్వమే ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే ఎలా అంటూ ప్రశ్నించారు. దీన్ని కూలగొట్టాలంటూ ఆదేశించారు. దీనితో జగన్ నిర్ణయంపై టీడీపీ  నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు అక్రమ కట్టడాలను తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించడంతో పరిస్థితి కాస్తా ఉద్రిక్తంగా మారింది. దీనితో తెదేపా నేతలందరూ మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేట్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచనలు చేశారు. 
 
కలెక్టర్ల సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ... గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక ఓ అక్రమ నిర్మాణమని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే, ఇక సామాన్య ప్రజలు ఎన్ని అక్రమ నిర్మాణాలు చేపడుతారంటూ అధికారులను ప్రశ్నించారు. అందుకే మనం కూర్చొన్న అక్రమ నిర్మాణమైన ప్రజా వేదికను ఎల్లుండి నుంచి (బుధవారం) కూల్చివేసే పనులు చేపడుతామని ఆయన ప్రకటించారు.
 
ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు సీఎం అధ్యక్షతన జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ ప్రజా వేదిక భవనాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. దీని నిర్మాణానికి నిబంధనలను తుంగలో తొక్కి నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్దంగా, అవినీతి సొమ్ముతో కట్టారు. ఓ ఇల్లీగల్ బిల్డింగ్‌లో ఇంతమంది అధికారులం ఇల్లీగల్ అని తెలిసీ సమావేశం జరుపుకుంటున్నాం. గరిష్ట వరద వస్తే ఇది మునిగిపోతుంది అని ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు ఈ లేఖను ఇచ్చారు. అందువల్లే అనుమతిని జారీ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. అయినా టెండర్ అంచనాలను రూ.5 కోట్ల నుంచి రూ.8.9 కోట్లకు పెంచి నిర్మించారు.
 
ఇందుకోసం ఇద్దరు బిడ్డర్లు రాగా, ఒకరిని ఉద్దేశపూర్వకంగా తప్పించారు. ప్రజావేదిక అన్నది అవినీతితో కట్టిన అక్రమ నిర్మాణం. రేపు పొద్దున ఈ తప్పును మరొకరు చేయకుండా మేం ఆదర్శంగా నిలుస్తాం. అందుకోసం ప్రజావేదికను ఎల్లుండి నుంచి కూలగొడతాం. అక్రమ కట్టడాల తొలగింపును ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఎవరైనా సామాన్యులు ఇలాంటి బిల్డింగ్‌ను కట్టి ఉంటే ఇప్పటికే తొలగించేవాళ్లని చెప్పారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధగా అనిపించదా? అని అధికారులను జగన్ నిలదీశారు.