గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (18:04 IST)

కొడాలి నానిలో ఇంత మార్పేంటి? తిరుమలకు వచ్చి అది వదిలేశారా..?

కొడాలినాని. వైసిపిలో రోజా తరువాత ఫైర్ బ్రాండ్ ఈయనే. నోరు తెరిచారంటే ప్రతిపక్ష పార్టీ నేతలను ఏకిపారేస్తారు. పదునైన విమర్సలు, బూతలే బూతులు. ఇదంతా కొడాలి నాని అభిమానులకే కాదు వైసిపి కార్యకర్తలకు బాగా ఇష్టం. అందుకే కొడాలి నాని స్పీచ్ అంటే చాలు పరుగెత్తుకుంటూ వెళుతుంటారు వైసిపి శ్రేణులు.
 
కానీ అలాంటి కొడాలి నాని ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖామంత్రిగా ఉన్నారు నాని. గత కొన్నిరోజులుగా చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు, టిడిపి సీనియర్ నేతలను ఏకిపారేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్సిస్తే అస్సలు ఊరుకోరు.
 
వారికి సరైన రీతిలో మాటలతోనే సమాధానం చెబుతుంటారు. అలాంటి నాని గత నెలరోజులుగా చాలా సైలెంట్‌గా కనిపిస్తున్నారు. తిరుమలలో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు కొడాలినాని. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆలయం వద్ద ప్రశాంతంగా కనిపించారు. మీడియా రాజకీయాలు గురించి అడిగితే అస్సలు సమాధానం చెప్పలేదు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ చెప్పి వెళ్ళిపోయారు. కొడాలి నానిలో ఈ మార్పు చూసి మీడియా ప్రతినిధులు కూడా అవాక్కయ్యారు. 
 
తిరుమల స్వామివారి దర్సనం తరువాత కొడాలి నాని తన కోపాన్ని, ఆవేశపూరితమైన మాటలను వదిలిశారా అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అందరికీ దణ్ణం పెడుతూ కొడాలి నాని గుడి ముందు నుంచి వెళ్ళిపోయారు.